కేసీఆర్‌ ప్రజాస్వామ్య గొంతునొక్కేస్తున్నారు

– చెక్‌పవర్‌ ఉపసర్పంచ్‌కి ఎలా ఇస్తారు?
– బీజేపీ ఎంపీ అరవింద్‌, బండి సంజయ్‌
న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష పాలనతో ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తున్నారని భాజపా ఎంపీలు అర్వింద్‌, బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచుల అరెస్టు వ్యవహారంపై వారు బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.. మంగళవారం జగిత్యాలలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్టు చేశారని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. సర్పంచులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనన్నారు. సర్పంచ్‌, కార్యదర్శికి ఉన్న చెక్‌ పవర్‌ ఉపసర్పంచ్‌కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అవగాహన లేకే సీఎం కేసీఆర్‌ అనవసర నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బండి సంజయ్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారి.. అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని హితవు పలికారు. స్వచ్ఛభారత్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణంలో సర్పంచులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. ఒప్పుకోని సర్పంచులను అరెస్టు చేస్తోందని చెప్పారు. మరుగుదొడ్లు, ఎల్‌ఈడీ బల్బుల అంశంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతి బాగోతంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.