చితిపై నుంచి శవం స్వాధీనం

పోస్ట్‌మార్టానికి పంపిన పోలీసులు
లక్నో,అక్టోబర్‌28(జనం సాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. యువతిని చంపిన భర్త తదితరులు ఆమెను దహనం చేస్తుండగా పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.  చితిపై ఉన్న మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లి శవ పరీక్ష నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2007వ సంవత్సరంలో పుష్పేంద్రకు పూనమ్‌ను ఇచ్చి వివాహం చేశారు. పుష్పేంద్ర తన మామ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. పూనమ్‌ ఉరి పెట్టుకొని చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు అత్తగారింటి నుంచి ఫోన్‌ వచ్చింది. వాళ్లు చోళా చౌకీ గ్రామానికి వెళ్లి చూసేసరికి మంచంపై ఆమె మృతదేహం కనిపించింది. కొన్ని రోజుల క్రితం డబ్బులు కావాలని  తన కూతురిని అల్లుడు హింస పెడితే తానే డబ్బులిచ్చానని తండ్రి ఏడుస్తూ చెప్పాడు. పూనమ్‌ తండ్రి రాజ్‌పాల్‌, సోదరుడు, కుటుంబు సభ్యులు తమ కూతురు ఎలా చనిపోయిందని ఆమె భర్తను ప్రశ్నించారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పూనమ్‌ తండ్రి, సోదరుడిపై అత్తగారింటివారు దాడి చేసి ఒక రూమ్‌లో పడేశారు. అనంతరం అత్తింటి వారు ఆమె మృతదేహాన్ని తీసుకొని శ్మశాన వాటికకు వెళ్లారు. పూనమ్‌ తండ్రి, సోదరుడు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి మృతదేహం చితిపై సగం కాలిపోయింది. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పుష్పేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.