జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు
11 మంది మృతి,19 మందికి తీవ్రగాయాలు
శ్రీనగర్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లోరన్‌ నుంచి పూంఛ్‌ వెళ్తున్న బస్సు మండి ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడి 100విూటర్ల లోతున్న లోయలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. సమాచారమందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఘటనాస్థలంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.