జాబిల్లి కక్షలోకి చంద్రయాన్‌-2

– సెప్టెంబర్‌ 7న తెల్లవారుజామున జాబిల్లిపైకి
– వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌
బెంగళూరు, ఆగస్టు20(జనం సాక్షి) : హైదరాబాద్‌, ఆగస్టు20(ఆర్‌ఎన్‌ఎ) : చంద్రయాన్‌- 2 విజయవంతంగా లూనార్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశించినట్లు ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సెప్టెంబర్‌ 2వ తేదీన చంద్రయాన్‌2కు సంబంధించి మరో కీలక ఘట్టం ఉంటుందన్నారు. ఇక నుంచి జరగబోయే అన్ని పక్రియల్ని సాంకేతిక అంశాలతో సహా వివరించారు. మంగళవారం చంద్రయాన్‌-2లో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సిన విన్యాసం ఉదయం 9గంటలకు ప్రారంభమై 30మిషాలు పాటు సాగిందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి చేరాలంటే ఓ కచ్చితమైన కక్ష్యలోకి వ్యోమనౌకను చేర్చాల్సి ఉంటుందని తెలిపారు. దానికి ఉపగ్రహాన్ని 90డిగ్రీలు మళ్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం 88 డిగ్రీల ఇంక్లినేషన్‌తో చంద్రయాన్‌-2 చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మరోసారి కక్ష్యను మార్చాల్సి ఉంటుందని, అప్పుడు 90 డిగ్రీల ఇంక్లినేషన్‌కి చేరుకుంటుందని శివన్‌ తెలిపారు. జులై 22న ప్రయోగించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 5 విన్యాసాలు చేపట్టామని, అందులో ఆగస్టు 14న చేపట్టిన ట్రాన్స్‌ ల్యూనార్‌ పక్రియ అత్యంత కీలకమైనదన్నారు. ఇప్పటి వరకు చంద్రయాన్‌-2లోని వ్యవస్థలన్నింటి పనితీరు సజావుగా సాగుతోందని శివన్‌ వివరించారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌-2 జాబిల్లి ఉపరితలానికి చేరుకునే క్రమంలో చేసే ప్రయోగాలను శివన్‌ సాంకేతిక అంశాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేశారరని, మరో నాలుగు విన్యాసాల ద్వారా చంద్రయాన్‌-2 కక్ష్యలను తగ్గిస్తూ వస్తామన్నారు. సెప్టెంబరు 2న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోతుందని, ల్యాండర్‌లో వ్యవస్థలన్నింటిని సిద్ధం చేసేలా సెప్టెంబరు 3న మూడు సెకన్ల పాటు మరో విన్యాసం చేయాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబరు 4న మరో 6సెకన్ల పాటు ల్యాండర్‌పై మరో విన్యాసం ఉంటుందని, అక్కడి నుంచి మూడురోజుల పాటు వ్యవస్థలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తామని, ఇక సెప్టెంబరు 7న వేకువజామున 1.40గంటలకు ల్యాండర్‌లో ప్రొపల్షన్‌ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్‌ అవుతుందని అన్నారు. అనంతరం రెండు గంటల తర్వాత ల్యాండర్‌లోని ర్యాంప్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందన్నారు. 3.10గంటలకు సోలార్‌ ప్యానెళ్లు తెరచుకుంటాయని, సరిగ్గా 4గంటల ప్రాంతంలో రోవర్‌ జాబిల్లి ఉపరితలానికి చేరకుని మిషన్‌ని ప్రారంభిస్తుందన్నారు. చంద్రుడి ఆవిర్భావం సహా అక్కడి వాతావరణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేపడుతుందని శివన్‌ ప్రయోగ వివరాలను వివరించారు.