జైల్లో సాధారణ జీవితం గడిపిన చిదంబరం
– టీ, ఓట్స్ మాత్రమే అల్పాహారం
న్యూఢిల్లీ, సెప్టెంబర్6 (జనం సాక్షి ) : ఐఎన్ఎక్స్ విూడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మొదటిరోజు సాధారణ ఖైదీలాగే జీవితాన్ని గడిపినట్లు జైలు అధికారులు తెలిపారు. రాత్రి అందరితోపాటు సాధారణ ఆహారం తీసుకుని, తనతో తెచ్చుకున్న మందులను వేసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు గురువారం సాయంత్రం తరలించారు. గురువారం రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయాలతో డిన్నర్ చేసినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం మాత్రం ఆయన కేవలం టీ, ఓట్స్ను అల్పాహారంగా తీసుకున్నారట. శుక్రవారం ఉదయం ఆయన కాసేపు వాకింగ్ చేశారని సమాచారం. మిగతా ఖైదీలకు వడ్డించిన భోజనాన్నే చిదంబరానికి కూడా వడ్డిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే చిదంబరానికి తీహార్ జైలులోని 7వ నంబర్ సెల్ను కేటాయించారు. ఈడీ కేసుల్లో అరెస్టయిన వారిని ఇక్కడ ఉంచుతారు. గతంలో ఇదే కేసులో కార్తీ అరెస్టయినప్పుడు 7వ సెల్లోనే 12 రోజులు గడిపారు. కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేకంగా ఒక గది, వెస్టన్ర్ టాయిలెట్ కేటాయించామని, అంతకుమించి ఎలాంటి సదుపాయాలు లేవని అధికారులు తెలిపారు.