ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ నోరువిప్పాలి
– ట్విట్టర్లో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి) : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ..’అసలేం జరిగిందో మోదీ దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ అంశం విూద భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ప్రధాని మోదీ కోరినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదేగనుక నిజం అయితే భారత దేశ ప్రయోజనాలను, 1972 సిమ్లా ఒప్పందాన్ని మోదీ కాలరాసినట్లేనని అన్నారు. ట్రంప్తో సమావేశంలో ఏం చర్చించారో దేశ ప్రజలకు ప్రధాని తప్పకుండా బయటపెట్టాలని రాహుల్ ట్వీట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలని, వారి భేటీలకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలని పార్లమెంటులో కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిమాండ్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ ఆయన్ను కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ రాజ్యసభలో స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్తో ఉన్న వివాదాలన్నింటినీ.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తేల్చి చెప్పారు.