తనకు అడ్డొచ్చిన వారిని..  మమతా బెనర్జీ చంపిస్తున్నారు


– ఆమె ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌లా మారారు
– సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌
కోల్‌కతా, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : తనకు అడ్డొచ్చిన వారిని పశ్చిమ బంగ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ హతమార్చుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. మమతా బెనర్జీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో పోల్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ మాదిరిగా తనకు అడ్డొచ్చిన వారిని మమతా బెనర్జీ చంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘దేశంలో పశ్చిమ్‌బంగ రాష్ట్రంలో మాత్రమే ప్రజాస్వామ్యం లేదని అన్నారు. మమతా బెనర్జీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లా ప్రవర్తిస్తున్నారని, తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో రాష్ట్రంలో భాజపా తలపెట్టిన యాత్రను మమత ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. భాజపా ఈ యాత్ర చేపట్టాలనుకుంటున్న ప్రాంతాల్లో వర్గ పోరు చెలరేగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు పశ్చిమ్‌ బంగ ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై భాజపా హైకోర్టును ఆశ్రయించగా.. యాత్ర నిర్వహించుకోవచ్చని ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ్‌ బంగ ప్రభుత్వం కలకత్తా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అక్కడ భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో భాజపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించుకోవచ్చు నని అన్నారు. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరని, సుప్రీంకోర్టులో మేమే గెలుస్తామని, ఖచ్చితంగా పశ్చిమ బంగలోని అన్ని నియోజకవర్గాల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా యాత్రను నిర్వహిస్తారని అన్నారు.