తిరుమల శ్రీవారికి బాంగారు హస్తాలు

ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం..

తిరుమల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్‌ కు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు. 5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి రూ 3.5 కోట్ల విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి, వరద హస్తాలను అలంకరించనున్న శ్రీవారి ఆలయ అర్చకులు. భక్తితో చేసిన విరాళమని, ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో దాత సమాచారాన్ని టీటీడీ గోప్యంగా ఉంచింది.