తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌

అన్ని రంగాల్లో దూసుకుని వెళుతున్నాం

దగాపడ్డ తెలంగాణను ఒడ్డున పడేస్తున్నా

వ్యవసాయం, పారిశ్రామక రంగాల్లో విప్లవాత్మక చర్యలు

ఐటిలో తెలంగాణ దూసుకుని పోతున్నది

రైతులను రాజు చేయడమే లక్ష్యంగా పెట్టుబడి పథకం

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

గ్రావిూణ ఆర్థికరంగం బలోపేతానికే కులవృత్తులకు ప్రోత్సాహం

కార్పోరేట్‌కు దీటుగా వైద్యరంగంలో ప్రోత్సాహకాలు

అవతరణ దినోత్సవ సందేశంలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని అన్నారు. అలాగే చేపట్టిన పనులు, అభివృద్దిని వివరిస్తూ ఏ మేరకు విజయం సాధించామో తె

లిపారు. అనేక రంగాల్లో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగామని అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు, దోపిడీకి గురైంది. అన్ని రంగాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఆవహించింది. బతుకువిూదనే ఆశను కోల్పోయేంతగా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనె వాస్తవం గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు, వాటి కారణాలు, పరిష్కారాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాం. ఆ ఆలోచన పునాదుల విూదనే మానిఫెస్టోను రూపొందించి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి మానిఫెస్టోలోని అంశాలను వెంటవెంటనే అమలు చేస్తున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలనెన్నింటినో ప్రవేశపెట్టాం. ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, మరోవైపు నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నానని అన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో

కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, ఆయా రాష్టాల్రలో అమలుచేసేందుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనం. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రోల్‌ మోడల్‌ అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు.

21 శాతం ఆదాయాభివృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత నిచ్చింది. 42 లక్షల మంది అసహాయులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నది. దేశంలో ఎవరూ, ఎక్కడా, ఎన్నడూ ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, మజీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే ఇమామ్‌, మౌజన్‌ లకు ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తున్నది. ఆడపిల్ల పెళ్లి వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవద్దని కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని బడి పిల్లలందరికీ సన్నబియ్యం బువ్వ పెడుతున్నది. దేశంలో 40వేల కోట్లతో, 40 పథకాల ద్వారా ప్రజా సంక్షేమం కోస పెద్ద ఎత్తున పాటుపడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ.

వ్యవసాయ రంగాభివృద్ధి

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని, వృత్తి పనులను తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నది. దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తూ వస్తున్నది. రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు-విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, డ్రిప్‌ ఇరిగేషన్‌ కు, పాలీ హౌజ్‌ లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, రైతన్నలు చెల్సించాల్సిననీటితీరువా బకాయిల రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణాపన్ను రద్దు, తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించాం. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక రైతులు అనుభవించిన కష్టాలకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త అనుకునే స్థాయికి విద్యుత్‌ రంగాన్ని తీసుకురాగలిగాం. 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరాతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినయి. రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండినయి.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం

సమైక్య రాష్ట్రంలో సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. ఏది ఏమైనా సరే తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయాదానికి ప్రభుత్వం నడుం కట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నది. మైక్య రాష్ట్ర పాలకులకు తెలంగాణా ప్రజలను భ్రమ పెట్టి పబ్బం గడుపుకోవాలనే దురాలోచననే తప్ప, నిజంగా తెలంగాణకు ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యమెన్నడూ లేదు. ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమవుతుంది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా డిజైన్‌ చేసి, తర్వాత ఆ వివాదలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు. అందుకే ప్రభుత్వం సమైక్య పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణా అవసరాలకు తగిన విధంగా రీ డిజైన్‌ చేయవలసి

వచ్చింది. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, చారిత్రక ఒప్పందం చేసుకున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగాం. నదీ జలాల వినియోగానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాలను కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాయి. దీనివల్ల గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.శరవేగంగా ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో లోయర్‌ పెన్‌ గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతీసారి ఒక ఎన్నికల అంశంగా వాడుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి తో ప్రయత్నం చేయడం వాళ్ళ చనాఖా-కొరాటా బ్యారేజి నిర్మాణం వేగంగా జరుగుతున్నది. గోదావరి, కృష్ణ నదుల విూద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే చేపట్టాం. వీటిలో కొన్ని పూర్తిచేయగలిగాం. మరికొన్నినిర్మాణదశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు వీలుగా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, నీటి లభ్యతల ఆధారంగా అవసరమైన మేరకు ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయించుకుంటున్నాం. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌, మిడ్‌ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కొమురంబీమ్‌, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌ పూర్‌ లాంటి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా కొత్తగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌ మాట్‌ బ్యారేజి, మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్‌ఆర్‌ఎస్పి పునరుజ్జీవన పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, 365 రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజిని నిర్మిస్తున్నాం. పాలమూరు ప్రజల కన్నీరు తుడిచి, వారి పొలాలకు సాగునీరు అందించాలని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. కృష్ణా జలాల్లో తెలంగాణకున్న వాటాను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా వ్యూహాత్మకంగా శ్రీశైలం రిజర్వాయర్‌ ను సోర్సుగా ఎంచుకుంది. వలస కూలీల కేంద్రంగా పేరు పడిన పాలమూరుతో పాటూ , తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని భూములకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో కరువు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజవర్గం సస్యశ్యామలమైంది. అదే స్పూర్తితో ఖమ్మం జిల్లాలోని అణువణువును గోదావరి జలాలతో తడిపేందుకు తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీవన ముఖచిత్రమే మారిపోతుంది.

వరప్రదాయిని కాళేశ్వరం

గోదావరి నదీ జలాలను సమగ్రంగా వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణాకు జీవనదాయిని నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌,

భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తీ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. 37 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అన్నిరకాల అనుమతులు సాధించాం.ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు, కార్మికులు రేయింబవళ్ళు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దారుణమైన నిర్లక్ష్యానికి గురై, విధ్వంసమైన వేలాది చెరువులు మిషన్‌ కాకతీయ వల్ల పునరుద్ధరణకు నోచుకున్నాయి. దీంతో సాగు భూమి విస్తీర్ణం పెరగటంతోపాటు, భూగర్బ జల మట్టం కూడా పెరిగింది. గ్రామసీమల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 46,500 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్రధానమైన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి.

రైతుబంధు – పంట పెట్టుబడి పథకం

రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడికి తెరతీసాం.

/ూష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున ఈ ఏడాది నుంచే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడత చెక్కుల పంపిణీతో గ్రామాలలో, ముఖ్యంగా రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. . కొంతమంది సంపన్నవర్గాలకు చెందిన రైతులు, దాతలు తమకు ఇచ్చిన పెట్టుబడి మొత్తాలను తిరిగి రైతు సంక్షేమానికే వినియోగించమని ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. దీనితోపాటుగా పథకంలో తామూ భాగస్వాముల మవుతామని, శక్తికొలది విరాళాలు అందిస్తామని ముందుకు వస్తుండటం ఆనందాన్నిస్తోంది.పేద రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాధంలో పడిపోతాయి. పెద్ద దిక్కును కోల్పోయినా వారి కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా, అతడి కుటుంబానికి పది రోజుల్లోగానే 5 లక్షల రూపాయల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. ఆగస్టు 15నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభవుతుంది. ఎవరూ సాహసించని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం కేవలం వంద రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయగలిగాం. ఏ భూమికి ఎవరు యజమానులన్న విషయంలో స్పష్టత వచ్చింది. పంట పెట్టుబడి చెక్కులతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్‌ 20లోగా రైతులందరికీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయింది.అవినీతికి, జాప్యానికి ఆస్కారంలేని విధంగా రాష్ట్రంలో నూతన రిజిస్టేష్రన్‌ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ‘ధరణి’ అనే పేరుతో వెబ్‌ సైట్‌ రూపొందిస్తున్నది. జూన్‌ 20వరకు భూములకు సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ధరణిలో నమోదు చేస్తారు. ఈ వెబ్‌ సైట్‌ వల్ల భూముల వివరాలన్నీ ఒకే చోట అందరికీ అందుబాటులో ఉంటాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే వ్యవసాయంతో పాటు కులవృత్తులు బాగుపడాలి.అందులో భాగంగానే రాష్రంలో పెద్ద మానవ వనరులుగా వున్నయాదవ, గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేస్తున్నది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను మాత్రం బెస్త, ముదిరాజ్‌, తదితర మత్యకారులకు అందించే కార్యక్రమాలు చేపట్టింది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకునాయీబ్రాహ్మణులకు, అధునాతన యంత్రపరికరాల కొనుగోలుకు రజకులకు , తదితర కులాలవారికి ఆర్థిక సహాయం అందించబోతున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యంలో ఈత, తాడిచెట్ల పెంపకం చేపట్టింది. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లపై విధించే పన్ను చెట్ల రకం ను పూర్తిగా రద్దుచేశాం. సంచార కులాలు, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారికోసం వెయ్యి కోట్ల రూపాయలతో ఎం.బి.సి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు పాడిరైతులకు లీటరుకు 4 రూపాయలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నాం. ్గ/లంగాణా ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పథకం మిషన్‌ భగీరథ. ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది గ్రామాలకు శుభ్రమైన తాగునీరు అందుతున్నది. రాబోయే కొద్ది నెలల్లోనే అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నది. ఆశించిన ఫలితాలు అందించబోతున్నది.రాష్ట్రం ఏర్పడే నాటికి మనకు జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. జాతీయ సగటు 2.80 కిలోవిూటర్లుంటే, తెలంగాణలో మాత్రం కేవలం 2.20 కిలోవిూటర్లు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో 2,527 కిలోవిూటర్ల జాతీయ రహదారులుంటే, ఈ నాలుగేళ్లలో కొత్తగా 3,155 కిలోవిూటర్ల జాతీయ రహదారులు సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో 5,682 కిలోవిూటర్ల జాతీయ రహదారులున్నాయి.గత ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇల్లు పథకాన్ని అవినీతిమయంగా మార్చేశాయి. ఇల్లు పేరుతో కేవలం ఒక్కగది నిర్మించడం కోసం డబ్బులు మంజూరు చేసే ఈ పథకంలో అనేక చోట్ల అసలు ఇండ్లు నిర్మించుకుండానే బిల్లులు కాజేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం బలహీనవర్గాల గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులు చెల్లించవలసి వున్న దాదాపు 4వేల కోట్ల రూపాయల రుణ బకాయిలను కూడా రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గృహ నిర్మాణ పథకం అమలుచేయడంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. నూటికి నూరుశాతం ప్రభుత్వ వ్యయంతో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పథకం క్రింద 2.65 లక్షల ఇండ్లు మంజూరు చేసి, నిర్మిస్తున్నాం. వీటిలో కొన్ని ఇప్పటికే నిర్మించి పేదలకు అందించడం జరిగింది. మానవీయ కోణంతో కె.సి.ఆర్‌ కిట్స్‌ పేరుతో అపూర్వమైన పథకాన్ని అమలుచేస్తున్నాం. నిండు గర్భిణీలు, బాలింతలు కూలీకి వెళ్ళకుండా, వారు నష్టపోయే కూలీనిప్రభుత్వమే చెల్లించే విధంగా అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందజేస్తోంది. కె.సి.ఆర్‌ కిట్స్‌ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఇప్పటివరకూ రెండు లక్షల మందికిపైగా మహిళలకు ఈ ప్రయోజనాలు అందించడం జరిగింది. ప్రభుత్వ దవాఖానాలలో కావల్సిన వైద్య పరికరాలు, మందులు , ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులపట్ల ప్రజలలో అపోహలు తొలగిపోయి, విశ్వాసం పెరిగింది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు అనే పేరుతో పథకాన్ని రూపొందించింది. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. కేజీ టు పిజి ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించాం. ఇటీవల జరిగిన సివిల్స్‌ పరీక్షలలో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించడంతోపాటు, దేశం మొత్తంవిూద ప్రథమస్థానం సాధించింది కూడా తెలంగాణ బిడ్డే కావడంమనందరికీ గర్వకారణం. మన జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్‌ అనే యువకుడుసివిల్స్‌ లో ప్రథమ స్థానం సాధించడం నాకు ఎంతో సంతోషం కల్గించింది. అలాగే అనేకమంది క్రీడాకారులు, పర్వతారోహకులు మన రాష్ట్రం నుంచి వెలుగులోకిరావడం, మనరాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొనిరావడం మనందరికీ సంతోషదాయకం. అందుకే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకొని గౌరవప్రదంగా జీవించాలని, చదువుకు ఆర్థిక సమస్య ఆటంకం కాకూడదని విదేశీ చదువులకు వెళ్ళేవారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం విూకు తెలుసు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పాఠ్యాంశాల బోధన, క్రీడలు, వ్యక్తిత్వవికాసం కల్పించే విధంగా రాష్ట్రంలో గురుకులాలను తీర్చిదిద్దుతున్నాం.

తెలంగాణకు హరితహారం

భవిష్యత్‌ తరాలకు మంచి పరిసరాలను, మంచి వాతావరణాన్ని అందించాలి. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున అమలుచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం ఆనందదాయకం. గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయితీరాజ్‌ చట్టాన్ని తీసుకువచ్చాం.

గ్రామాలకు దూరంగా ఉన్న తండాలు గూడాలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా మార్చాం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకువచ్చే పారిశ్రామిక వేత్తలకు మన రాష్ట్రంలో అమలుచేస్తున్న టి.ఎస్‌ – ఐ.పాస్‌ సింగిల్‌ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా వుంది.

ప్రపంచంలో మన హైదరాబాద్‌ నగరం ఒక ప్రముఖ ఐ.టి హబ్‌ గా గుర్తింపు పొందింది. ఇకపోతే

తెలంగాణ పోలీసు శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తున్నది. ప్రభుత్వం పోలీసు శాఖను ఆధునీకరించడంతో పోలీసు సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతున్నాయి. కల్తీ విత్తనాలు, ఎరువులను నిరోధించడానికి ప్రభుత్వం ఈ నేరాలను పిడి యాక్టు పరిధిలోకి తెచ్చింది. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణా గమ్యాన్ని ముద్దాడుదాం. యావత్భారతావనికి దిక్సూచిగా నిలుద్దాం. మరోమారు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని కెసిఆర్‌ అన్నారు.

—————