తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం
తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, నాలుగున్నర కోట్ల మందిని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం దుయ్యబట్టారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి వయలార్‌ రవిని కలిసిన కోదండరాం అనంతరం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను నిలువెల్లా మోసం చేసి, అధికారాన్ని అనుభవిస్తూ, తెలంగాణ బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి ఉద్యమ రుచి చూపిస్తామని ఉద్యేగంగా మాట్లాడారు. తెలంగాణలో ఎనిమిది వందల మంది యువకులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటుతూ ఆత్మబలిదానాలు చేసుకున్నా, కేంద్రంలో కించిత్‌ చలనం కూడా రాలేదన్నారు. తెలంగాణ మృత్యుకేళి సాగుతుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారన్నారు. అందుకే, మలి విడత ఉద్యమాన్ని నడుపుతున్నామని, ఇందులో భాగంగానే ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కవాతులో ఢిల్లీ గద్దెలు దద్దరిల్లుడు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు కులమతపార్టీలకతీతంగా ఈ మార్చ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌కు దీటుగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కోదండగరాం వెల్లడించారు.