దద్ధరిలుతున్న ఢిల్లీ

– అన్నదాత తల్లడిల్లి..

– జలఫిరంగులు, లాఠీలకు ఎదురొడ్డి..

– నూతన వ్యవసాయ చట్టాల రోత..రైతన్న గుండె కోత

– ఎముకలు కొరికే చలిలో రణనినాదం

– నాలుగోరోజూ జంగుసైరన్‌..

– షరతుల్లేకుండా చర్చలకే సిద్ధం..

న్యూఢిల్లీ,నవంబరు 29(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు నాలుగో రోజూ కొనసాగించారు. ఈ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీలోని సంత్‌ నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వేలాది మంది పంజాబ్‌, హరియాణా రైతులు శనివారం ఢిల్లీ శివార్లలోని సింగూ, టిక్రీ సరిహద్దులోనే బైఠాయించారు.సంత్‌ నిరంకారీ మైదానానికి వెళ్లే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవర్చే వరకూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వంట పాత్రలు సైతం తెచ్చుకున్నారు. ట్రాక్టర్‌ ట్రాలీలు, వాహనాల్లోనే నిద్రిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. ఆదివారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత బల్జీత్‌సింగ్‌ మహల్‌ చెప్పారు.పంజాబ్‌, హరియాణా రైతులకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌ రైతులు కూడా ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద బైఠాయించారు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ?విూర్జాపూర్‌ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ధర్నా చేయాలనుకుంటే ఉత్తర ఢిల్లీలోని సంత్‌ నిరంకారీ మైదానానికి వెళ్లాలని జాయింట్‌ కమిషనర్‌ సురేందర్‌ సింగ్‌ యాదవ్‌ సూచించారు. అయితే, జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సంత్‌ నిరంకారీ గ్రౌండ్‌లో రైతుల నిరసన కొనసాగుతోంది. శనివారం రైతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కార్యాలయ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని దుయ్యబట్టారు.కాగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులు ఢిల్లీలోని సంత్‌ నిరంకారీ గ్రౌండ్‌కు వెళ్లాలని ¬ం మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. అక్కడే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయవచ్చని చెప్పారు. తాము సూచించిన ప్రాంతానికి వెళ్లిన రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ శివార్లలో బైఠాయించిన రైతులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వెంటనే నిరంకారీ మైదానానికి వెళ్లాలని అమిత్‌ షా ¬ంశాఖ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు.ఇదిలా ఉండగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి స్పందించారు. రైతుల ఆందోళనలు రాజకీయ ప్రేరేపిత నిరసనలుగా తానెప్పుడూ పేర్కొనలేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా అలా పిలవనని అభిప్రాయపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి అమిత్‌షా, ఈ విధంగా స్పందించారు.’దిల్లీ చలో’ పేరుతో పంజాబ్‌ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో భాజపాకే చెందిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ఈ ఆందోళనలపై ఘూటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనల వెనుక రాజకీయ పార్టీలు హస్తం ఉందని, వారి మద్దతుతోనే రైతులు చలో దిల్లీకి పిలుపునిచ్చారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు, నిరసన తెలుపుతున్న పంజాబ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చర్యలకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా, రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. ఆందోళనలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదిలాఉంటే, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తోన్న వివిధ రాష్ట్రాల్లోని 30 రైతు సంఘాలు ప్రస్తుత ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యాయి. సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమైనప్పటికీ, షరతులు విధించడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నేరుగా రైతులతోనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. ఇక డిసెంబర్‌ 1 నుంచి రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు పోరాట సమితి పిలుపునిచ్చింది.