దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం
– ప్రాణాలు కోల్పోయిన 17మంది
– మృతుల్లో 8మంది భారతీయులు
– వెల్లడించిన దుబాయిలోని భారత రాయబార కార్యాలయం
ముబాయి, జూన్7(జనంసాక్షి) : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయిలో గురువారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 8 మంది
భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్ను దాటుకుంటూ వెళ్లి సైన్బోర్డును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు దుబాయి పోలీసులు వెల్లడించారు. కాగా.. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. భారత్కు చెందిన రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్రామ్ జవహార్ ఠాకూర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్ అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని, బాధితులకు రాయబార కార్యాలయం అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో మరికొందరు భారతీయులు గాయపడగా.. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.