దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు


కేరళలోనే 17,983 కేసులు నమోదైన
సాధారణ పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం
ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరిక
న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి) దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయట పడగా, 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో నిన్న 127 మంది
మరణించారని వెల్లడిరచింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది. ఇదిలావుంటే కరోనా మహమ్మారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా సాధారణ పరిస్థితులు వస్తాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. మాస్కులు దరించడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి చేస్తూనే ఉండాలన్నారు. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే.. మనం దీన్నుంచి బయటపడి కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులకు వెళ్లొచ్చని రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, అందువల్ల ప్రజలు రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కొవిడ్‌ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. అయితే టీకాలు తీసుకున్నవారి ద్వారా.. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి వైరస్‌ సోకితే అలాంటివారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఈమేరకు అందరూ తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించారు. కొవిడ్‌ విషయంలో ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులు ఉన్నాయని, రోజురోజుకీ వైరస్‌ తిరోగమనంలో సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు. పండగల సీజన్‌ మళ్లీ కేసులను పెంచే పరిస్థితికి తీసుకుని రాకూడదన్నారు. మనం మహమ్మారి అంతాన్ని చూడాలనుకుంటున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు, గుంపులుగా చేరడం మానుకోవాలన్నారు. కరోనా చికిత్సకు అందించే ఔషధాల నుంచి ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)ని తొలగిస్తూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), కొవిడ్‌`19 నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొవిడ్‌ బాధితుల్లో మరణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఇవి పెద్దగా ప్రభావం చూపడం లేదని, అందువల్ల వాటిని జాబితా నుంచి తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. అజిత్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఇచ్చినప్పుడు దాని ప్రభావం తీవ్రంగా ఉంటోందన్నది కూడా మరో కారణమని పేర్కొన్నాయి. ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలోనూ ఐవర్‌మెక్టిన్‌ వల్ల వైరల్‌ లోడ్‌లో కానీ, రోగ లక్షణాలు కొనసాగే సమయంలో కానీ తగ్గుదల కనిపించలేదని తేలింది.
దేశంలో క్రమేపీ తగ్గుముఖం పడుతున్న కొవిడ్‌ క్రియాశీలక కేసుల సంఖ్య శుక్రవారం 3 లక్షలకు చేరువైంది. రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 31,382 మంది కొత్తగా వైరస్‌ బారిన పడగా.. 318 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరగా.. ఇంతవరకు 4,46,368 మంది మహమ్మారికి బలైపోయారు. మొత్తం 3,28,48,273 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.78కి పెరిగింది. ఒక్క రోజులో 32,542 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,00,162కి తగ్గింది. 188 రోజుల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి.