నదీజలాల పంపిణీలో ఒప్పంద ఉల్లంఘనలు సహించం

కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటనపై పాక్‌ స్పందన
ఇస్లామాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా తమకు నష్టం కలిగే విషయాల్లో మాత్రం ఊరుకునేది లేదని పాక్‌ ప్రకటించింది. నదీ జలాలను అడ్డుకుంటామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటనపై పాక్‌ స్పందించింది. మొత్తం ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్థాన్‌కు, మరో మూడు నదులపై ఇండియాకు హక్కులు ఉన్నాయి. మూడు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు.. మూడు తూర్పు నదులు బియాస్‌, రావి, స్లటెజ్‌పై భారత్‌కు హక్కులున్నాయి. అయితే భారత్‌కు హక్కులున్న నదుల్లో మిగులు నీరు పాకిస్థాన్‌కు వెళ్తున్నది. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ నదుల్లోని నీటిని పాకిస్థాన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటామని, ఆ జలాలను జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హెచ్చరించారు. దీనిపై పాకిస్థాన్‌ స్పందించింది. తూర్పు నదుల్లోని నీటిని భారత్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా తమకు నష్టం లేదని స్పష్టం చేసింది. దీనిపై మాకు ఆందోళనగానీ, అభ్యంతరంగానీ ఏవిూ లేదు. ఆ నదుల్లోని నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు. సింధూ నదీ జలాల ఒప్పందం అందుకు అనుమతి ఇచ్చింది అని పాకిస్థాన్‌ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్‌ స్పష్టం చేశారు. అయితే తమకు హక్కులున్న పశ్చిమ నదులు చీనాబ్‌, సింధు, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం కచ్చితంగా తమ అభ్యంతరాలను లేవనెత్తుతామని ఆయన తెలిపారు.