నవీ ముంబై, థానే,పుణె పేర్లు మార్చాలి

సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ
ముంబయి,నవంబర్‌29(జ‌నంసాక్షి):  మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లను మార్చాలనే ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ సభ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదనల వెనుక బిజెపికి ఎలాంటి రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే శివసేన చాలా కాలం నుంచి జౌరంగబాద్‌ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం విూడియాతో మాట్లాడుతూ నవీ ముంబై పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్‌ నగర్‌గా, థానే పేరును జిజామాతా నగర్‌గా, పూణె పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా
మార్చాలని కోరారు. మరోవైపు జౌరంగబాద్‌ పేరు మార్పుపై శివసేన ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పేరుతో దానికి ఆ పేరు వచ్చిందని, బిజెపి మతం పేరుతో నగరాల పేర్లను మారుస్తున్నట్లయితే వారి పార్టీలోని నేతల పేర్లు కూడా మార్చాలని అజ్మీ అన్నారు. ఈ క్రమంలో ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేరును ముఖేశ్‌ చంద్రగా, షాహనవాజ్‌ హుస్సేన్‌ పేరును శంకర్‌ మహాదేవన్‌గా మార్చాలని ఎద్దేవా చేశారు. కాగా, ఆజ్మీ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజ్‌ పురోహిత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్ర గురించి ఆజ్మీకి తెలియదని విమర్శించారు.