నాలుగు రాష్ట్రాలనే చూసుకోలేకపోతున్నాం.. మాకు కశ్మీర్‌ ఎందుకు?


– కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా చేయాలి
– పాక్‌ మాజీ క్రికెటర్‌ అఫ్రీదీ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నామని, ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్‌ ఎందుకు అంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ను వదిలేయండి.. ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూసుకోండి అని పాక్‌ ప్రభుత్వాన్ని అఫ్రిది డిమాండ్‌ చేశాడు. బుధవారం బ్రిటిష్‌ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తున్నది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అతను విమర్శించాడు. ఇక కశ్మీర్‌ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తున్నదని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్‌కు కశ్మీర్‌ అవసరం లేదని, అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దని, కశ్మీర్‌ ప్రత్యేక దేశం కావాలన్నారు. అక్కడి ప్రజలు చావకూడదు. మానవత్వం పరిఢవిల్లాలి అని అఫ్రిది అన్నాడు. గతంలోనూ కశ్మీర్‌ అంశంపై స్పందిస్తూ.. అక్కడ భారత్‌ అమలు చేస్తున్న విధానాన్ని అతడు విమర్శించాడు. అయితే అప్పట్లో భారత క్రికెటర్ల నుంచి కూడా అఫ్రిది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.