నేడు తిరుమలకు నూతన గవర్నర్‌

తిరుమల,జూలై22(జ‌నంసాక్షి):  రాష్ట్ర నూతన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కుటుంబీకులతో కలిసి మంగళవారం తిరుమల పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయల్దేరి మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటారు. అతిథిగృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల నుంచి బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు విమానంలో బయల్దేరి విజయవాడ వెళ్తారని కలెక్టర్‌ ఆ ప్రకటనలో వివరించారు. బుధవారం ఉదయం ఆయన గవర్నర్‌గా ప్రమాణం చేస్తారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి ఆయనచేత గవర్నర్‌గా ప్రమాణం చేయిస్తారు.