నేడు నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలు
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. నాగాలాండ్లో శనివారం జరగునున్న 12వ శాసనసభ ఎన్నికల్లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60 స్థానాలకు ఇద్దరు మహిళలు సహా 188 మంది బరిలో ఉన్నారు. వీరిలో 39 మంది స్వతంత్రులు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 60 స్థానాలకు, కాంగ్రెస్ 57, ఎన్సీపీ 15, భాజపా 11 జేడీయూ 3, ఆర్జేడీ 2, యునైటైడ్ నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయ ఎన్నికల్లో 345 మంది పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా పీఏ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ 32, ఎన్సీపీ 21, భాజపా 13 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.