పంద్రాగస్ట్ వేడుకలకు ముస్తాబైన చారిత్రక గోల్కొండ కోట
వరుసగా ఐదోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్
భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్ యంత్రాంగం
హైదరాబాద్,ఆగస్ట్14(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా డ్బసారి కెసిఆర్ జెండా ఎగురేయబోతున్నారు. ఇక్కడి నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల సంవత్సరం కావడంతో సిఎం కెసిఆర్ ప్రసంగానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన అనేక పథకాలను ప్రకటిస్తారని అనుకుంటున్నారు. తన పాలనలో తీసుకున్న చర్యలను,సాధించిన విజయాలను వివరిస్తారు. రానున్న రోజుల్లో తీసుకోబోయే కార్యక్రమాలను వివరిస్తారు. అలాగే అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. ఉమ్మడి ఎపిలో పరేడ్ గ్రౌడ్స్లో జరిగిన పంద్రాగస్ట్ వేడుకలు ఇప్పుడు గోల్కొండ వేదికగా సాగుతున్నాయి. దీంతో ఈ యేడు కూడా పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండకోటను అన్ని రకాల హంగులతో ముస్తాబు చేసారు. బుధవారం నిర్వహించే కార్యక్రమాలపై రిహార్సల్స్ పూర్తయ్యాయి. భద్రత కార్యక్రమాల రిహార్సల్స్తోపాటు పోలీసు, వివిధ భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి. విద్యార్థులు కూడా పలు కార్యక్రమాలపై రిహార్సల్స్ చేశారు. నిఘావర్గాల సూచనల మేరకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు. మరోవైపు విద్యుత్దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్శాఖ భారీబందోబస్తు ఏర్పాటుచేసింది. వేడుకలు జరిగే హైదరాబాద్లోని గోల్కొండ కోట పరిసరాల్లో వేలమంది పోలీసులను మోహరించింది. ఇందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సేవలను వినియోగిస్తున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. వేడుకలకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే రూట్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతుండగా మరోవైపు సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. భద్రత నేపథ్యంలో పోలీసు, పురావస్తుశాఖల అధికారులు భేటీ అయ్యారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా పురావస్తుశాఖ అధికారులు సహకరిస్తూ, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోల్కొండకోట వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెళ్లేమార్గంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రగతిభవన్ నుంచి గోల్కొండకోట కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. దారి పొడువునా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఆయాప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా పలుసూచనలు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ కోట రోడ్డును మూసివేస్తున్నట్లు తెలిపారు. వేడుకల నేపథ్యంలో గోల్కొండ, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వేడుకలకు హాజరయ్యే ప్రజలు హ్యాండ్ బ్యాగ్లు, బ్రీఫ్కేసులు, కెమెరాలు, టిఫిన్స్ లాంటి వస్తువులను తీసుకురావద్దని ఆయన సూచించారు. ఈ రకమైన వస్తువులను వెంట తెచ్చుకుంటే వారిపై చర్య లు ఉంటాయని సీపీ తెలిపారు.
పాస్లు వాహనాలు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు, పరేడ్ ప్రారంభానికి ముందు మాత్రమే రావాలి. ఆ తర్వాత తిరిగి అదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లె ఓవర్, లంగర్హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్గూడ రైట్ టర్న్తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్కు చేరుకోవాలి. అక్కడ నుంచి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలి. గవర్నర్ రాజ్భవన్లో సాయం త్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందు సందర్భంగా రాజ్భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపులా వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి. వీవీఐపీఎస్ లైన తెలంగాణ, ఏపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసన మండలి చైర్మన్లు, స్పీకర్లు, కేంద్ర మంత్రులు, రెండు రాష్ట్రాల మంత్రులు. వీరి వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్భవన్లోకి వెళ్లి, గేట్-2 నుంచి బయటకు రావాలి. ఈ వాహనాలను రాజ్భవన్ లోపల పార్కు చేయాలి.