పాతవిధానంలోనే నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష..


` సుప్రీంకోర్టు అసహనంతో కేంద్రం నిర్ణయం
దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఈ ఏడాది నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షల్లో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సవరించిన సిలబస్‌, కొత్త విధానాన్ని 2022`23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడిరచింది.నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష`2021కు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత పరీక్ష సిలబస్‌ను మార్చుతున్నట్లు కేంద్రం అర్ధాంతరంగా ప్రకటించింది. దీంతో కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ 41 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. వీరి రిట్‌ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో మార్పులు మంచివి కాదని, మార్పుల అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కేంద్రం, జాతీయ పరీక్ష బోర్డులను సూచించింది. బుధవారంలోగా సముచిత పరిష్కారంతో రావాలని ఆదేశించింది. కోర్టు అసహనం వ్యక్తం చేయడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ ఏడాది పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని బుధవారం కోర్టుకు తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విధానాన్ని అమలు చేస్తామని కేంద్రం వెల్లడిరచింది.