పుల్వామాలో కాల్పులు…
– నలుగురు జైషే ఉగ్రవాదుల హతం..
శ్రీనగర్, డిసెంబర్29(జనంసాక్షి) : దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన వారిని జైషే ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించారు. ఉగ్రవాదుల సంచారంపై నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా బలగాలు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. సైనికుల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారనీ.. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సదరు అధికారి తెలిపారు. కాగా మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియరాలేదు. మరింత మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కి ఉంటారన్న అనుమానంతో భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. చనిపోయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు జేఈఎం కమాండర్ ముజామిల్ భలి అలియాస్ అబు జందాల్ ఉన్నట్లు చెప్పారు. మిగతా మిలిటెంట్ల వివరాలు తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట జేఈఎం నేత మసూద్ అజహర్ అన్న కొడుకు మహమ్మద్ ఉస్మాన్ను భారత బలగాలు మట్టుబెట్టాయి. అతడిని హతమార్చడం ఈ ఏడాది సైన్యం సాధించిన గొప్ప విజయంగా అధికారులు భావించారు. ఈ నలుగురు ఉగ్రవాదుల మృతితో 2018లో భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 250 దాటింది. అయితే గత పదేళ్లలో పోలిస్తే ఈ ఏడాదే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.