పెళ్లిమండపంలో వధువుపై కాల్పులు

– వధువుకు తీవ్ర గాయాలు

– ఢిల్లీలోని షాకార్‌పూర్‌లో ఘటన

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : పెళ్లిమండపంలోనే నవ వధువుపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలోని షాకార్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన వధువు పూజ(19) వరుడితో కలిసి వేదికపై నిలబడింది. వివాహానికి వచ్చిన బంధువులు, స్నేహితులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో వధువుపై కాల్పులు జరిపి, అక్కడ నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా పెళ్లిమండపంలో కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. వధువు పక్కనే ఉన్న బంధువులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వధువుకాలికి గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. వధువుకు బాగా పరిచయమున్న వ్యక్తే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు కాల్పులు ఎవరు.. ఎందుకు జరిపారో? తనకు అర్థం కావడంలేదని వరుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపాడా? లేదా మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.