ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు పెరగని భరోసా
ఇంకా ప్రైవేట్ ఆస్పత్రులనే నమ్ముతున్న జనాలు
డాక్టర్ల కొరత కూడా కారణమంటున్న ప్రజలు
హైదరాబాద్,అక్టోబర్4 (జనంసాక్షి): ప్రసవాలకు ప్రభుత్వం ఎంతగా ప్రోత్సాహం అందిస్తున్నా ఇంకా చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కెసిఆర్ కిట్ల పంపిణీ జరిగిన తరవాత ప్రభుత్వ అస్పత్రులకు గర్భిణుల రాక సంఖ్యపెరిగినా వైద్యులు,నర్సుల కొరత కారణంగా చాలచోట్ల ప్రసవాలకు సమస్యగా మారుతోంది. దీనికితోడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుకున్న సమయానికి సిజేరియన్ చేయించుకోవచ్చన్న ధీమాలో కొందరు ఉన్నారు. సర్కార్ దవాఖానాల్లో వైద్యుల కొరత కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. దేశంలోకెల్లా అత్యధికంగా తెలంగాణలో 58 శాతం ప్రసవాలు శస్త్ర చికిత్సలు జరుగుతుండగా తెలంగాణలోనే అత్యధికంగా ఉమ్మడి ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను వేళ్ల విూద లెక్కించవచ్చు. ఆస్పత్రిలో అవసరమైనంత మంది స్త్రీ వైద్య నిపుణులు లేకపోవడం కడుపు కోతలు పెరగడానికి మరో కారణంగా భావిస్తున్నారు. సాధారణ ప్రసవాల కోసం ప్రయత్నించాలంటే నిరంతరాయంగా ప్రసవాల లేబర్ రూమ్లో స్త్రీ వైద్య నిపుణులు ఉండాలి. మూడు షిఫ్టుల్లో ముగ్గురు స్త్రీ వైద్య నిపుణులతోపాటు ఒకరు అదనంగా ఉంటేనే ఇది సాధ్యం. శస్త్ర చికిత్సల కోసం, గర్భిణులకు కాన్పుకు ముందు నెలవారీ పరీక్షల కోసం అదనంగా వైద్యులు అవసరం. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే ప్రసవాల్లో 70 శాతం మేరకు శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయనే విషయం వెల్లడవుతోంది. మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయినప్పుడు మాత్రమే దాదాపుగా రెండో, మూడో కాన్పులకు సాధారణ ప్రసవం కోసం వైద్యులు వేచి చూస్తున్నారు మినహా మొదటి కాన్పు అనగానే శస్త్రచికిత్స చేయడానికి ఉపక్రమిస్తున్నారు. గర్భిణి బంధువులే శస్త్ర చికిత్స ప్రసవం కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్న సంఘటనలు సైతం ఉన్నాయి. మరోవైపు ఫలానా ముహూర్తంలో బిడ్డ పుడితే భవిష్యత్తు బాగుంటుందంటూ శస్త్ర చికిత్సలతో ప్రసవాలు చేయించుకుంటున్న వారు సైతం ఉన్నారు. కాస్త ఓపిక పడితే సాధారణ ప్రసవం జరుగుతుందని వైద్యులు చెబుతుంటే,గర్భిణి నొప్పులతో బాధపడుతున్నా వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళనలు తరచూ ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొంటున్నాయి. ఈ తలనొప్పులు భరించలేని వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇక్కడ వారికి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. కొద్ది క్షణాల్లో సాధారణ ప్రసవం జరిగే పరిస్థితులున్నా గర్భిణి బంధువులకు ఏదో ఓ కారణం చెబుతూ వెంటనే శస్త్ర చికిత్సతో ప్రసవం చేయకపోతే కష్టమంటూ బెంబేలెత్తిస్తున్న సంఘటనలున్నాయి. కాన్పు కష్టమవుతోందని..కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ఉమ్మనీరు తాగాడని..బిడ్డ బరువు ఎక్కువగా ఉందని భయపెడతారు. దానికి తోడు బీపీ పెరిగిందని..వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే చిన్న ప్రాణానికే కాదు పెద్ద ప్రాణానికే ముప్పని అంటారు. నెలలు నిండినా పురిటి నొప్పులు రావడం లేదని కత్తికి పదను పెడతారు.ఒకరిద్దరు ప్రైవేటు వైద్యులు సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి చివరి క్షణంలో డబ్బుల కోసం శస్త్రచికిత్స చేశారంటూ ఆస్పత్రుల ముందు ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు సైతం ఉన్నాయి.సాధారణ ప్రసవాలు నామమాత్రంగానే సాగుతున్నాయని జాతీయ ఆరోగ్య మిషన్ ఇటీవల చేపట్టిన కుటుంబ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత, డాక్టర్ల కొరత వెరసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లకు దారితీస్తోంది. సాధారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ వైద్య, మత్తు వైద్య నిపుణుల కొరత ఉండటంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆయా పోస్టులు అత్యధికంగా ఖాళీలే కనిపిస్తుంటాయి.
ఇక ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించే సమయం ఎక్కడుంటుంది. అవసరమైన స్త్రీ, మత్తు వైద్య నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వారు ముందుకు రావడం లేదు. శస్త్ర చికిత్స అవసరం లేదని నచ్చజెప్పినా వినకుండా ప్రైవేటుకు వెళ్తుండటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ దుష్పచ్రారం చేస్తుంటారు. ప్రసవం తేదీకి ఒకటి రెండు రోజులు ఎక్కువగా కాగానే శస్త్ర చికిత్సకు ఒత్తిడి తెస్తుంటారు. అరుదైన కాన్పులు, హైరిస్క్ కేసుల్లో మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్సతో ప్రసవం చేయాల్సిందే. సాధారణ ప్రసవాలపై మొదట గర్భిణులు, వారి బంధువుల్లో సంపూర్ణ అవగాహన పెరగాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.