ప్రభుత్వ ఏర్పాటులో.. బీజేపీదే కీరోల్
– టీఆర్ఎస్, కూటమికి స్పష్టమైన మెజార్టీరాదు
– కేంద్రం నిధులిచ్చిన కేసీఆర్ పాలనలో విఫలమయ్యాడు
– బీజేపీ ఎం జీవీఎల్(జనంసాక్షి) : తెలంగాణలో హంగ్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని, అలా జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే బీజేపీదే కీరోల్ అవుతుందని రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ రావు తెలిపారు. హన్మకొండలోని బీజేపీ అర్బన్ ఆఫీస్లో శనివారం జీవీఎల్ విలేఖరులతో మాట్లాడారు.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పటికీ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్, కూటమిని ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదన్నారు. టీఆర్ఎస్, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని పేర్కొన్నారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీ రోల్ పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అన్నారు. కాంగ్రెస్ బలం సరిపోక రూ.500 కోట్లకు కక్కుర్తిపడి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ, చంద్రబాబు నాయుడును చూసి కూటమి నేతలు జంకుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కంట్రాక్టు రూపంలో టీడీపీతో జత కట్టిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరంగల్ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికారాన్ని ఉపయోగించి భూకబ్జాలు చేశారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చినా కేసీఆర్ పాలన చేయలేకపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబంలో తప్ప ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదని జీవీఎల్ ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు అన్ని కుటుంబ పార్టీలేనని, మూడు పార్టీలు పుత్రదాహం కోసం ఆరాట పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆ మూడు పార్టీల తీరును గమనిస్తున్నారని అన్నారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారని అన్నారు.