ప్రముఖ దర్శక, నిర్మాత.. బాపినీయుడు కన్నుమూత


– ఆనారోగ్యంతో బాధపడతూ తుదిశ్వాస విడిచిన బాపినీడు
– చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 786’ సహా పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం
– బాపినీయుడు మృతికి పలువురు నివాళి
హైదరాబాద్‌, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న బాపినీడు.. హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్‌ 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో బాపినీడు
జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు.. కొంతకాలం పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. తరవాత చెన్నైలో ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ మ్యాగజైన్లను ప్రారంభించారు. ‘విజయ’లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అప్పట్లో విపరీతంగా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీడుగా మారింది. ఆ తరవాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాపినీడు.. 1981లో దర్శకుడిగా మారారు.
చిరంజీవితో అత్యధిక సినిమాలు..
డబ్బు డబ్బు డబ్బు’ సినిమాతో మెగాఫోన్‌ పట్టుకున్న బాపినీడు మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్లను అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ సినిమాలతో పాటు మెగాస్టార్‌ వందో చిత్రం ‘ఖైదీ నంబర్‌ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సినిమానే. చిరంజీవి తరవాత రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. శోభన్‌బాబు, క్రిష్ణ, మోహన్‌బాబు వంటి సీనియర్‌ నటులతోనూ పనిచేశారు. దర్శకుడిగా 22 సినిమాలు తెరకెక్కించిన బాపినీడు.. శ్యాం ప్రసాద్‌ ఆర్ట్స్‌ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించారు. అలాగే స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధంతో ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్‌ను కూడా బాపినీడు నడిపారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం…
విజయ బాపినీడు మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తంచేశారు. పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన కొద్దిమంది నిర్మాతల్లో ఒకరని అన్నారు. బాపినీడు కుటుంబ సభ్యులకు సీఎం తన సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంతి  వ్యక్తంచేశారు. చిరంజీవి, మోహన్‌బాబు, మురళీ మోహన్‌, కృష్ణ తదితర హిరోలు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు.  కాగా విజయ బాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్‌ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.