ప్రియాంకకు యూపీ బాధ్యతలు
– పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
– రాష్ట్రాల వారీగా ప్రక్షాళనకు నిర్ణయం
లఖ్నవూ, జులై 15(జనంసాక్షి):లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆయా రాష్ట్రాల చీఫ్లు రాజీనామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీకి ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్కు కంచుకోటయిన అమేఠీలోనూ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. యూపీయే ఛైర్పర్సన్ సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్బరేలీలో మాత్రమే కాంగ్రెస్ నిలిచింది. ఎన్నికల్లో వైఫల్యం తర్వాత యూపీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలన్నింటినీ అధిష్ఠానం రద్దు చేసింది. ఎన్నికల్లో నెలకొన్న వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకుగానూ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఉత్తర్ప్రదేశ్లో 12అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా వీటిపై ఇప్పటికే దృష్టి సారించింది. దీంతో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్.. ప్రియాంకను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.