బయటపడుతున్న.. ఇంటర్ బోర్డు నిర్వాహకం
– బోర్డు తప్పిదాలతో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు
– 500మంది విద్యార్థులకు లభించని ప్రాక్టికల్ మార్కులు
– ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
– బోర్డు కార్యదర్శి అశోక్ను గెరావ్
– ఇంటర్ బోర్డులో ఎలాంటి తప్పిదాలు జరగలేదు
– రీకౌంటింగ్కు వెళ్లండంటూ బోర్డు కార్యదర్శి దురుసు వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్20(జనంసాక్షి) : తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ముట్టమడించారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో మంచిర్యాల జిల్లా టాపర్గా నిలిచిన ఓ విద్యార్థినికి ఈ ఏడాది ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్టియర్ తెలుగులో 98 మార్కులు వచ్చిన ఆమెకు…ద్వితీయ సంవత్సరంలో సున్నా మార్కులు వచ్చాయి. ఫెయిల్ మెమో రావడంతో విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ శనివారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే ఇంటర్ బోర్డు నిర్వాకంతో నష్టపోయిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమ పిల్లల జీవితాలతో ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ విద్యార్థులకు కూడా సున్నా మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం లేని వారితో పరీక్ష పేపర్లు దిద్దించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను బాధితులు ఘోరావ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఇంటర్ బోర్డులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, అదంతా అభూతకల్పన అని ఆయన కొట్టిపారేశారు. అయితే రీ-వాల్యుయేషన్ అయినా సక్రమంగా జరిపించాలని వారు కోరారు. ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల తప్పిదాల విషయంలో ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ నిర్ణయాల వల్ల ఎలాంటి తప్పులు దొర్లలేదని, పరీక్షల నిర్వహణ సిబ్బంది తప్పిదాల కారణంగా మూడు తప్పులే జరిగాయంటూ సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చే0స్తున్నారు. వందల మంది విద్యార్థుల మెమోల్లో మార్కులు రాలేదని, అనేక తప్పులు దొర్లాయని కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డుకు శుక్రవారం రాతపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా.. పెద్దగా తప్పులు జరగలేదన్నట్లు బోర్డు వ్యవహరించడం పలు అనుమానాలకు తావునిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.