బహుప్రమాదంగా ‘ఒమిక్రాన్‌’


` దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌
` అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన
` ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరిక
దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): కరోనా వైరస్‌ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ విరుచుకుపడుతోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త రకం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ డాక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ సూచించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల్ని కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు.ఆగ్నేయాసియా ప్రాంతంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో వైరస్‌ విజృంభిస్తుండటం, కొత్త వేరియంట్లతో ఆందోళనలు నిరంతర ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ నుంచి మనల్ని మనం రక్షించుకొనేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త వేరియంట్‌పై ఆయా దేశాలు నిఘా పెంచాలని సూచించారు. కొత్త వేరియంట్లు, వాటి వ్యాప్తిపై వస్తున్న సమాచారం ఆధారంగా అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ప్రమాదాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్‌ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతిఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురులేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పటివరకు ఆగ్నేయాసియా ప్రాంత జనాభాలో 31శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకోగా.. 21శాతం మందికి పాక్షికంగానే టీకా అందిందన్నారు. మిగతా 48శాతం మంది ఇంకా టీకా వేయించుకోవాల్సి ఉందని వివరించారు. అలాంటి వాళ్లకు ఈ మహమ్మారి ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నా ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు. మరోవైపు, ఈ కొత్త వేరియంట్‌పై భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు కచ్చితంగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు.