బిజెపి ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్
కేసులో జర్నలిస్ట్ అరెస్ట్
న్యూఢిల్లీ,జూలై25(జనంసాక్షి):బీజేపీ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో నిందితుడైన జర్నలిస్టు విజయ్ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్ నగరానికి చెందిన విజయ్ శుక్లా (39) జర్నలిస్టుగా స్థానిక పత్రికతోపాటు వెబ్ పోర్టల్ నడుపుతున్నారు. జర్నలిస్టు విజయ్ శుక్లా తనను రూ.3కోట్లు ఇవ్వాలని కోరాడని, డబ్బు ఇవ్వకుంటే తన పరువు తీస్తూ వార్తలు రాస్తానని బెదిరించాడని గురుగ్రామ్ ఎమ్మెల్యే అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 11వతేదీన తనను కలిసి విజయ్ శుక్లా డబ్బు విషయమై బేరసారాలు ఆడాడని, అనంతరం తన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకొని తనకు వ్యతిరేకంగా వార్తలు రాశాడని ఎమ్మెల్యే అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేర తాము జర్నలిస్టు విజయ్ శుక్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ముఖేష్ జాఖర్ చెప్పారు.