బీఆర్‌ఎస్‌ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నది

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముందు చూపు లేకుండా ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండబెట్టడం వల్లే అన్నదాతలు తీవ్ర సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవంటూ ధ్వజమెత్తారు. ఫిబ్రవరి నెలలో ఎండలు బాగా రావడం వల్లే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులూ రాలేదని చెప్పారు. ఈ మేరకు కోదండరెడ్డికి కౌంటర్ ఇస్తూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను ఏడాది కాలంగా ఎండబెట్టడం వల్లే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పదేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించాయి. ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించడం వల్లే ఏ రోజూ నీటి కష్టాలు రాలేదు. భూగర్భ జలాలూ పడిపోలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి నేడు కనిపిస్తోంది. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్‌గా కోదండరెడ్డి ఉంటూ వాస్తవాలు చెప్పాల్సింది పోయి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భ జలాలు పడిపోయాయని కోదండరెడ్డి చెప్పడం దారుణం. కళ్లముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిల్లాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరంగా ఉంది. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని చెప్పడం, మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం.

మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కరవు, కాటకాలు రావడం సహజమని చెప్పడం అన్యాయం. కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు. ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకంతో 430 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేపట్టారు.ఇలాంటి సందర్భం దేశ చరిత్రలోనే లేదు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి పంటలు కాపాడాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని అన్నదాతలు ఎప్పటికీ క్షమించరని” కేటీఆర్ ట్వీట్ చేశారు.