బులంద్‌షహర్‌ ఘటనలో నిష్పక్షపాతిక విచారణ జరగాలి

కుటుంబానికి భరోసా ఇచ్చే బాధ్యత సిఎం యోగిదే
లక్నో,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇటీవల  జరిగిన విధ్వంసకాండ ఒక ఎత్తయితే ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు తీయడం మరో ఎత్తు. దీనిపై చనిపోయిన పోలీస్‌ అధికారి కుటుంబం సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసినా పెద్దగా భరోసా దక్కలేదు. కఠిన చర్యలు తీసుకుని విచరాణ జరిపించడం ద్వారా వారిలో భరోసా కల్పించే హావిూని ఇవ్వలేదు. ఇది ఓ పోలీస్‌ అధికారికే ఇలా జరిగితే సామాన్యుల సంగతి వేరుగా చెప్పలేం. గోహత్య ఘఠన పేరుతో జరిగిన విధ్వంసంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ అధికారి మరణించడం ప్రభుత్వ వైఫల్యం కాక మరోటి కాదు.  యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా ఆలోచన చేయాల్సి ఉంది.  క్షేత్రస్థాయి సమస్యలను విస్మరించడంతో స్థానిక ప్రజానీకం ఆగ్రహంతో ఉంది. ఉన్మాదదాడిలో మృతి చెందిన పోలీసు అధికారి సుబోధ్‌ కుమార్‌కు నిజాయితీగా వ్యవహరిస్తారని, ముక్కుసూటిగా పోతారని పేరుంది. ఉత్తపప్రదేశ్‌లోని దాద్రిలో 2015సంవత్సరంలో బీఫ్‌ను నిల్వ ఉంచారన్న సాకుతో అఖ్లాక్‌ను గో గూండాలు దారుణంగా కొట్టి చంపిన కేసును ఆయన దర్యాప్తు చేశారు. బలమైన ఆధారాలతో ఆ కేసును ముగింపు దశకు తీసుకుని రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అక్కడి నుండి బదిలీ చేసింది. అప్పటినుండి హిందూ మతోన్మాద శక్తులకు ఆయన లక్ష్యంగా మారాడన్న ఆరోపణలూ ఉన్నాయి.  ఆ కేసు దర్యాప్తు తరువాత ఆనేక బెదిరింపులు వచ్చాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజా ఘటనలో విధ్వంస మూకలు ఆయన్నే లక్ష్యంగా చేసుకుని వెంటాడి మరీ చంపాయి. ఎన్నికల వేళ తమకు వ్యతిరేకంగా నిజాయితీగా వ్యవహిరించే అధికారులను ఈ హత్య ద్వారా మతోన్మాద శక్తులు హెచ్చరించదల్చుకున్నాయా? అన్నది ఆలోచన చేయాలి. పౌరులకు రక్షణ కల్పిస్తామన్న భరోసా ఇవ్వాల్సింది యోగి మాత్రమే. మరోవైపు ఈ కేసులో
ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముస్లిం కుటుంబాలకు చెందిన ఇద్దరు మైనర్‌ యువకులుండటం, మరికొందరు సంఘటన జరిగిన సమయంలో అసలు గ్రామంలోనే లేరని కుటుంబ సభ్యులు చెప్పడం చూస్తుంటే అనేక సందేహాలకు తావిస్తోంది. రాష్ట్ర పోలీస్‌శాఖ కూడా ఇది కుట్రే అని చెబుతోంది. ఈ హింసాకాండకు ఎవరు వ్యూహ రచన చేశారు, ఎవరు అమలు చేశారు, క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర ఎవరిది, భాగస్వాములైంది ఎవరు? పోలీస్‌ అధికారి ప్రాణాలు పోవడానికి కారణమెవరు? అనే అంశాలు ఇప్పుడు తేలాల్సి ఉంది.  పోలీస్‌ శాఖ నుండి, నిఘా వర్గాల నుండి ఉద్రిక్త పరిస్థితులపై నివేదికలు అందుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దర్యాప్తు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే బాధితులకు భరోసా కలుగుతుంది.