భద్రతాదళాల అదుపులో.. జేఈఎం ఉగ్రవాది

– బురాముల్లా పాతబస్తీకి చెందిన మొహ్సీన్‌ సల్హెన్‌గా గుర్తింపు
న్యూఢిల్లీ, అక్టోబర్‌7( జనం సాక్షి ) : పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ (జేఈఎం) చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న భారత భద్రతా దళాలకు సోమవారం ఉగ్రవాది చిక్కాడు. బారాముల్లా జిల్లాలో పట్టుబడిన ఉగ్రవాదిని బారాముల్లా పాత బస్తీకి చెందిన మొహ్సీన్‌ మంజూర్‌ సల్హెయాగా గుర్తించారు. దీనిపై రక్షణ రంగ నిపుణుడు ఖమర్‌ ఆఘా స్పందిస్తూ.. భద్రతా దళాలకు ఇది భారీ విజయమని అన్నారు. ఎందుకంటే అతడి నుంచి ఇంటిలిజెన్స్‌ అధికారులు, భద్రతా సిబ్బంది పెద్దఎత్తున సమాచారం రాబట్టే అవకాశం ఉందన్నారు. ఉగ్రవాదులను
నడిపిస్తున్నది ఎవరు, ఎలాంటి ఆయుధాలు వారికి అందుతున్నాయి, ఏ విధంగా వారికి శిక్షణ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఉగ్రవాదులు పాగా వేశారు… ఇలాంటి వివరాలన్నీ అతడి నుంచి రాబట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌ పోలీసులకు ఇది భారీవిజయమని విశ్రాంత మేజర్‌ జనరల్‌ పీకే సెహగల్‌ పేర్కొన్నారు. కాగా జైషేమహ్మద్‌ ఉగ్రవాదిని అరెస్టుచేయడం ద్వారా ఓ భారీ ఉగ్రదాడిని నిరోధించామని, అతడి నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని జమ్మూ కశ్మీర్‌ డీజీ దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు.