భారత్‌ వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ

కోవిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
న్యూఢల్లీి,అక్టోబర్‌20 జనంసాక్షి :  భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్‌ ఆర్‌టీ`పీసీఆర్‌ రిపోర్టును సమర్పించాలని పేర్కొంది. కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ పెరగడంతో సవరించిన ఈ మార్గదర్శకాలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయి. కేటగిరీ ’ఏ’లోకి వచ్చే దేశాల నుంచి భారత దేశానికి వచ్చేవారు అదనపు నిబంధనలను పాటించవలసి ఉంటుంది. భారత దేశానికి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి నిబంధనలను పాటించాలి. దీనిని ఈ నెల 20న అప్‌డేట్‌ చేశారు. ఈ కేటగిరీలోకి వచ్చే దేశాల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సహా యూరోపులోని దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే ఉన్నాయి. కేటగిరీ ’బీ’లోకి వచ్చే దేశాలతో భారత ప్రభుత్వం ఓ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు పొందిన కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న వ్యక్తులకు జారీ చేసిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు పొందిన కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న భారత పౌరులను మినహాయిస్తున్న దేశాలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నేపాల్‌, బెలారస్‌, లెబనాన్‌, అర్మేనియా, ఉక్రెయిన్‌, బెల్జియం, హంగరీ, సెర్బియా ఈ జాబితాలో ఉన్నాయి. దీనిని ఈ నెల 20న అప్‌డేట్‌ చేశారు.