మరో ప్రేమోన్మాది ఘాతుకం


ప్రేమించాలంటూ యువతి గొంతుకోసి పరార్‌
దుండగుడి కోసం పోలీసుల గాలింపు
చెన్నై,నవంబర్‌28(జనంసాక్షి): నడిరోడ్డుపై యువతిని దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాట కలకలం రేపింది. ప్రేమించలేదన్న అక్కసుతో రోడ్డుపైనే యువతి గొంతు కోశాడు ఓ కసాయి. ఈ దారుణం తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు… తక్కలైకు చెందిన మెర్సీ వల్లియూరు బస్టాండు ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పని ముగించుకుని హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాండుకు వచ్చింది. కాగా తిరుకురుంగుడికి చెందిన రవి అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా మెర్సీని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమెను కలిసేందుకు వల్లియూరుకు వచ్చాడు. మెర్సీ వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని అడిగాడు. కానీ మెర్సీ
అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన రవి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పారిపోయాడు. కత్తి సరాసరి గొంతులో దిగటంతో అధిక రక్తస్రావమై మెర్సీ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.