మహారాష్ట్రలో దారుణం
కుటుంబ సభ్యులతో సహా బిజెపి నేత కాల్చివేత
ముంబయి,అక్టోబర్7 మహారాష్ట్రలోని జల్ గావ్ ప్రాంతంలో బిజెపి నేత రవీంద్ర ఖారత్ (55)తో పాటు అతడి నలుగురు కుటుంబ సభ్యులను దుండగులు కాల్చి చంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బిజెపి కార్పొరేటర్ రవీంద్ర ఖారత్ (55), ఆయన కుటుంబ సభ్యుల్లోని నలుగురిని దుండగులు ఆయన ఇంట్లోనేకాల్చిచంపారు. దుండగులు రవీంద్ర ఖారత్ ఇంటికి వచ్చి రవీంద్ర ఖారత్ తో పాటు అతని సోదరుడు సునీర్ ఖారత్, కుమారులు రోహిత్, ప్రేమ్ సాగర్, దగ్గరి బంధువు సుమిత్ లను కాల్చి చంపారని లోకల్ ఎస్ పి పంజాబ్ రావ్ వుగాలే తెలిపారు. వ్యక్తిగత కక్షలతోనే దుండగులు ఈ హత్యలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.