మొహర్రం సందర్బంగా కశ్మీర్లో మళ్లీ కర్ఫ్యూ
ఎయిమ్స్కు తరిగామి తరలింపు
శ్రీనగర్,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : మొహర్రం పండగ సందర్భంగా జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో అల్లర్లు రేగే అవకాశాలుండటంతో మళ్లీ కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్ తోపాటు పలు కశ్మీర్ లోయలోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. శ్రీనగర్ లోని లాల్ చౌక్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సాయుధ పోలీసులను మోహరించారు. లాల్ చౌక్ ప్రాంతానికి కంచె వేసి మొహర్రం సందర్భంగా ఎవరూ ఊరేగింపులు నిర్వహించకుండా సీలు వేశారు. మొహర్రం ఊరేగింపులను నిషేధించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో ఆంక్షలు విధించారు. అత్యవసర వైద్యం కోసమే కర్ఫ్యూ పాసులు జారీ చేసి కొందరినే అనుమతిస్తున్నామని పోలీసులు చెప్పారు. కర్ఫ్యూ సందర్భంగా పలు నగరాలు, పట్టణాల్లో వ్యాపారసంస్థలు, దుకాణాలు, మార్కెట్ మూతపడింది. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు కశ్మీర్ ప్రత్యేక వాదులైన నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. దాదాపు నెల రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉన్న సీపీఎం నాయకుడు ఎం.వై. తరిగామిని వెంటనే ఎయిమ్స్కు తరలించాలని సుప్రీం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ఆయనతో పాటు ఓ వైద్యుడు, వారి బంధువులు, ఓ పోలీసు అధికారిని కూడా ఆయనతో పంపించినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు 5 న కేంద్రం ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజించాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్లో ఎలాంటి అల్లర్లు జరగకూడదన్న ముందస్తు జాగ్రత్తతో అక్కడి ప్రతిపక్ష నాయకులను కేంద్రం గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత ముఫ్తీతో పాటు సీపీఎం నేత తరిగామిని కూడా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది.