మోడీ విధానాలకు చెంపపెట్టు

సాగుచట్టాల రద్దుపై సిపిఎం నేత మధు వ్యాఖ్య

విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి  )  : వ్యవసాయ చట్టాల రద్దు రైతాంగ పోరాటానికి గొప్ప విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు ఇది చెంపపెట్టని అభివర్ణించారు. మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాని మోడీ రద్దు చేస్తున్నామని ప్రకటించిన నేపధ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో మధు మాట్లాడుతూ… రైతులు, కార్మికులు దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా చేస్తున్న ఉద్యమానికి గొప్ప విజయమని పేర్కొన్నారు. మూడు నల్ల చట్టాలు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఉద్దేశించబడ్డాయన్నారు. వీటిపై సాగిన దేశవ్యాప్త పోరాటం ప్రజలందరి మద్దతు పొందిందన్నారు. ఈ నేపధ్యంలో మోడీ`బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల చట్టాలను వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించిందని తెలిపారు. రానున్న కాలం పోరాటాలకు, ఉద్యమాలకు ఆహ్వానించే కాలంగా నిలుస్తాయని ఈ సంవత్సర కాలంగా జరిగిన ఉద్యమాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఈ ఉద్యమానికి సహకరించిన ప్రజలందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.