యువతిపై కత్తితో దాడి చేసిన దుండగుడు

తిరిగి ఆత్మహత్యాయత్నం
ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు
లక్నో,నవంబర్‌27(జ‌నంసాక్షి):  మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి ఆపై తాను గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవిద్య అభ్యసిస్తున్న విద్యార్థినికి ట్యూషన్‌ క్లాసులకు వెళ్లే సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరువురు పెండ్లి చేసుకుందామనుకున్నారు. కాగా వ్యక్తి తల్లిదండ్రులు నిరాకరించారు. కొన్ని నెలల అనంతరం వేరే మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. వ్యక్తి పెండ్లి అనంతరం సదరు విద్యార్థిని ఇరువురి బంధానికి స్వస్తి పలికింది. అయినా తనతో సంబంధం కొనసాగించాల్సిందిగా పేర్కొంటూ వివాహితుడు విద్యార్థినిని వేధింపులకు గురిచేసేవాడు. గడిచిన ఆదివారం రాత్రి నిందితుడు విద్యార్థిని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇరువురి సంభాషణలు కొనసాగుతుండగానే ఒక్కసారిగా స్కూ డ్రైవర్‌తో దాడి చేశాడు. అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన కత్తితో పలుమార్లు పొడిచాడు. మహిళ అరుపులతో ఆమె తల్లి గదిలో పరుగున వచ్చేసరికి నిందితుడు సైతం అదే కత్తితో తన గొంతు కూడా కోసుకున్నాడు. పోలీసులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహిళను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. పోలీసుల నిర్బంధంలోనే నిందితుడికి చికిత్స కొనసాగుతుంది.