వామ్మో వాన..


` చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు
` తమిళనాడును వీడని వానలు
` వాయుగుండంతో ప్రభుత్వం అప్రమత్తం
` లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
` అవసరమైతేనే బయటకు రావాలని సూచనలు
చెన్నై,నవంబరు 11(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. 17 గంటలైనా.. చినుకు ఆగే సూచనలు కనిపించడంలేదు. అత్యధికంగా చోళవరంలో 22 సెంటీ విూటర్లు, గుమ్మిడిపూండీలో 18 సెంటీ విూటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాలోనూ సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవారణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చెన్నై, నారపట్నం, పుదుచ్చేరి కరైకాల్‌లో 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏడు ఓడరేవుల్లో కూడా 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. చెన్నైలో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై సహా ఉత్తర జిల్లాల్లో అతి భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుంది. ఈ జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఇప్పటికే వర్షాల కారణంగా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల వల్ల చెన్నై శివారులో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గురువారం సాయంత్రానికి మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కి.విూ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా మహాబలిపురంలో పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది.