వినాయక ఏర్పాట్లలో అపశృతి

విద్యుద్ఘాతానికి ఇద్దరు యువకులు మృతి
గాంధీనగర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశమంతా వినాయక వేడుకలకు సిద్ధమవుతున్న వేళ గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వినాయక ప్రతిమను తరలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని బరోచి జిల్లాలో చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు అడ్డంగా ఉండడంతో వాటిని తప్పించేందుకు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గణనాథుని వేడుకులకు ముస్తాబవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.