శక్తిమంతమైన దాడులకు బాంబుల కోసం ఐఎస్ ప్రయోగాలు!

77వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరిన్ని శక్తిమంతమైన దాడుల కోసం ప్రయోగాలు చేస్తోందట. రెండేళ్ళ క్రితం ఇరాక్‌లోని మోసుల్ విశ్వవిద్యాలయాన్ని ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) స్వాధీనం చేసుకుంది. దీనిలోని రసాయనిక ప్రయోగశాలను ఐఎస్ ఉపయోగిస్తోందని సమాచారం. భీకరమైన బాంబులను తయారు చేసేందుకు ఈ ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహిస్తోందని ఇరాక్ సైనికాధికారులు చెప్తున్నారు. ఐఎస్ త్వరలోనే రేడియోధార్మిక ‘‘డర్టీ’’ బాంబును తయారు చేసి, పేల్చబోతోందని ఇటీవలే వార్తలు వచ్చాయి.
ఇరాక్ పేలుడు పదార్థాల విభాగం అత్యున్నత అధికారి జనరల్ హతెమ్ మాగ్సోసి మాట్లాడుతూ మోసుల్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ డాయీష్ పరిశోధన కేంద్రమని చెప్పారు. రసాయనిక ఆయుధాలు, పెరాక్సైడ్‌ ఆధారిత బాంబులు, ఆత్మాహుతి బెల్టులు వంటివాటి తయారీ కోసం ఈ ప్రయోగశాలను ఐఎస్ ఉపయోగించుకుంటోందని తెలిపారు. బెల్జియం, పారిస్ దాడుల్లో ఇటువంటి ఆయుధాలనే ఉపయోగించారన్నారు.
అయితే అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐఎస్ ఆగడాలను అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే మోసుల్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడులు జరిగాయి. గత నెల 19న మరిన్ని భీకర దాడులు జరిగాయి. అయితే నష్టం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టత లేదని అమెరికా సైనికాధికారి కల్నల్ స్టీవ్ వారెన్ తెలిపారు. హార్వర్డ్ పరిశోధకుడు మాథ్యూ బన్ ఓ వ్యాసంలో ‘‘రేడియో ధార్మిక పదార్థాలను ఆసుపత్రులు, పారిశ్రామికవాడలు, మొదలైనవాటి నుంచి సులువుగా దొంగిలించవచ్చు’’ అని పేర్కొన్నారు.