శబరిమల ప్రధాన పూజారిగా

ఏకే సుధీర్‌ నంబూద్రీ
తిరువనంతపురం, ఆగస్టు17(జనంసాక్షి ) : శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రధాన పూజరి(మేల్‌సంతి)గా ఏకే సుధీర్‌ నంబూద్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 17 నుంచి ఆయన ఆలయ ప్రధాన పూజారిగా ఏడాదిపాటు కొనసాగుతారు. మలప్పురం జిల్లాలోని తిరువయ్య ఆలయంలో ప్రస్తుతం ఏకే సుధీర్‌ నంబూద్రీ పూజారిగా ఉన్నారు. అయితే ఈయన స్థానంలో ఇదే ఆలయానికి ఎర్నాకుళంకు చెందిన ఎంఎస్‌ పరమేశ్వరన్‌ నంబూద్రీ పూజారిగా రానున్నారు. ఆలయంలో శనివారం ఉదయం డ్రా పద్ధతిలో ప్రధాన పూజారి ఎంపిక జరిగింది. స్పెషల్‌ కమిషనర్‌ ఎం మనోజ్‌ పర్యవేక్షణలో ఆలయ పూజారి డ్రా జరిగింది. రాబోయే ప్రధాన పూజారికి ప్రస్తుతం ఉన్న పూజారి ఓ నెల రోజుల పాటు ఆలయ వేడుకలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. నవంబర్‌ 16వ తేదీన కొత్త పూజారుల ప్రమాణం జరుగుతున్నది. ఆ మరుసటి రోజే మండల పూజ కోసం శబరిమల ఆలయద్వారాలు తెరుస్తారు.