శశిథరూర్కి ఊరట!
– బెయిల్ మంజూరు చేసిన అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ర్
న్యూఢిల్లీ, జూన్7(జనంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ సమర్ విశాల్ ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత
పూచీకత్తు కింద రూ.20వేలు చెల్లించాలని ఆదేశించారు. శశిథరూర్పై ఢిల్లీ బీజేపీ నేత రాజీవ్ బబ్బార్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం కేసులో కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరైన శశిథరూర్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్లో బెంగళూరు వేదికగా జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో శశిథరూర్ మాట్లాడుతూ.. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ మాటను మోదీ వినే పరిస్థితుల్లో లేరని అర్ధం వచ్చేలా శశిథరూర్ విమర్శలు చేశారు. మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివారు. చేత్తో తొలగించలేరు, చెప్పుతో కొట్టనూ లేరంటూ ఆయన పేర్కొన్నారు. ఓ ఆరెస్సెస్ నేత గతంలో ఒక మ్యాగజైన్కు రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని శశిథరూర్ చెప్పారు. అయితే శశిథరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేసింది.