సార్క్ సమావేశాల్లో పాల్గొనేది లేదు
పాక్కు తేల్చి చెప్పిన భారత్
న్యూఢిల్లీ,నవంబర్28(జనంసాక్షి): పాకిస్థాన్లో జరగనున్న సార్క్ సమావేశాల్లో పాల్గొనబోమని ఇండియా తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాని మోదీకి పాకిస్థాన్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్లే ప్రసక్తే లేదని ఇండియా స్పష్టం చేసింది. నిజానికి ఈ సార్క్ సమావేశం 2016లోనే జరగాల్సింది. అయితే అప్పట్లో యురి ఉగ్రదాడి నేపథ్యంలో తాము పాల్గొనబోమని భారత్ చెప్పింది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ కూడా వెనుకడుగు వేయడంతో ఆ సదస్సు రద్దయింది. ప్రతి రెండేళ్లకోసారి సార్క్లోని ఎనిమిది సభ్యదేశాల్లో ఒకటి సమావేశాలను నిర్వహిస్తుంది. 2016లో రద్దవడంతో ఇప్పుడు పాకిస్థాన్కు మరో అవకాశం వచ్చింది. ఈసారి కర్తార్పూర్ కారిడార్ పనుల ప్రారంభంలో భారత్కు చెందిన మంత్రులు కూడా పాల్గొననున్న నేపథ్యంలో సార్క్ సమావేశాలకు రావాల్సిందిగా ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం పంపినా భారత్ తిరస్కరించింది. చివరిసారి సార్క్ సమావేశాలు 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగాయి.