సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
న్యూఢల్లీి,నవంబర్30(జనం సాక్షి): ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో విచారించానన్నారు. సినిమా ’సిరివెన్నెల’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ.. ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను ఒకడినన్నారు. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానన్నారు. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మరణవార్త వినాల్సిరావడం విచారకరమన్నారు. సిరివెన్నల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.