సెంచరీ కొట్టడమే లక్ష్యం

తెలంగాణ ఉద్యమ కోసం ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కెసిఆర్‌ వేయని ఎత్తు లేదు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఆయన చేసిన అనేక సాహసాలకు ప్రజలు జేజేలు కొట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా అదే ఎత్తులతో అనేక పథకాలతో ఆయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అనేక పథకాలను అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ధీమాతో వందసీట్లకు పైగానే గెల్చుకుని మల్లీ అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు. ఏ కార్యక్రమం చేపట్టినా కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. స్వామివారి ఆశీస్సులు.. విూ దీవెనలతో యుద్దానికి పోతున్నా.. 100 సీట్లు సాధించి మళ్లీ అద్భుతమైన అధికారాన్ని చేపట్టబోతున్నాం అని అన్నారు. ప్రధానంగా కెసిఆర్‌ ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానకి ఎత్తుకున్నారు. రైతుబంధుతో పాపులర్‌ అయిన కెసిఆర్‌ ఇప్పుడు వారినే నమ్ముకున్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన వారినే ఓటు బ్యాంక్‌గా గ్రహించారు. ఇందులో భాగంగానే భారతదేశంలోనే గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు, ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పుకోవాలన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దేశంలోనే అతి ఎక్కువ ఆర్థికప్రగతి సాధించాం.. 24 గంటలు కరంట్‌ అందిస్తున్నాం. అతికొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించుకున్నాం. ఈ ఎన్నికల్లో మరోమారు గెలిచి మిగతా పనులు పూర్తి చేయడం ద్వారా బంగారు తెలంగాణ సాధించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. మిషన్‌ భగీరథ..కాళేశ్వరం ప్రాజెక్ట్‌.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం..ఇవన్నీ కూడా కెసిఆర్‌ కలల ప్రాజెక్టులు. నీళ్లు,నిధులు నియామ కాలు అన్న స్లోగన్‌తో ఉద్యమాన్ని గమ్యం చేరేలా చేసి…అధికారం చేపట్టిన తరవాత ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముఖ్యమైనవి. ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగనుంది. దేశానికి ఈ పథకం ఆదర్శంగా మారింది. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల రూపు రేఖలను మార్చి పేదల ఇళ్లకు కొత్త అర్థం చెప్పాక ఇప్పుడు పెద్ద ఎత్తున డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం సాగుతోంది. రెండు పడకగదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఈ నాలుగేళ్లలో విద్యుత్‌ సమస్యను అధిగమించాం. అది కొని ఇస్తున్నారా..లేక మరో రకంగా ఇస్తున్నారా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే కరెంట్‌ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే. నడిబజార్‌లో నిలబడి ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత నాలుగేళ్ల కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఇలాంటి నిర్ణయాలతో తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి. ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయి. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 31 జిల్లాలో చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది.ఉద్యోగాల భర్తీ పక్రియనూ సర్కారు వేగవంతం చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని

అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి పేదలకు వరంగా నిలిచాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ అయ్యింది. తెలంగాణలో కోతులు వాపస్‌ పోవాలన్న నినాదం ఊరావాడా సాగింది. నాలుగేళ్లుగా మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగుతోంది. నిరంతర విద్యుత్‌,నీటి సరఫరా, ఎరువులు విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎకరాకు 8వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలు గానే చూడాలి. కెజి టూ పిజిలో భాగంగా గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ఇలా గత నాలుగేళ్ల కాలంలో కళ్లకు కనిపించే అనేక పథకాలను సాకారం చేశారు. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే మొడి ధైర్యం కెసిఆర్‌ది. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి ఈ పనులు కనువిప్పు చేసి చూపించారు. అందుకే వందసీట్ల లక్ష్యం ప్రకటించారు. తను చేపట్టిన పని విజయవంతంగా పూర్తి చేయడమే తప్ప వెనుదిరిగి చూడని ధృడచిత్తం కెసిఆర్‌కే సొందం. ఈ ఎన్నికల్లో ఆయన లక్ష్యం ఏ మేరకు నెరవేరుందన్నది చూడాలి.