14 ఏళ్లలో ఆరుగురిని పొట్టన పెట్టుకున్నమహిళ

తిరువనంతపురం: సొంత కుటుంబాన్నే టార్గెట్ చేసుకున్న మహిళ గత 14 ఏళ్లలో ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. పక్కా స్కెచ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఈ హత్యల పరంపరను కొనసాగించింది. ఆమె పకడ్బందీ ప్లాన్ చూసి పోలీసులు కూడా షాకయ్యారంటే ఆమె ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో అర్థం చేసుకోవచ్చు. సొంత కుటుంబ సభ్యులనే పొట్టన పెట్టుకున్న ఆమె పేరు జాలీ థామస్. కేరళలోని కోజీకోడ్ నివాసి. అత్తమామల ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలనుకున్న ఆమె ఈ ఘోరకలికి తెరలేపింది. జాలీ భర్త పేరు రాయ్ థామస్.
2002లో రాయ్ తల్లి అన్నమ్మ థామస్ మృతితో ఈ హత్యల పరంపర మొదలైంది. ఆ తరువాత 2008లో రాయ్ తండ్రి కూడా అనుమాస్పద స్థితిలో మృతి చెందారు. 2011లో రాయ్ థామస్, 2014లో ఆయన మేనమామ మాథ్యూస్ కూడా ఇదే విధంగా కన్నుమూశారు. చివరిగా 2016లో.. జాలీ థామస్ మరో బంధువు సిలీ, ఆమె కూతురు(2) కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు.సైనైడ్ కలిపిన ఆహారంతో వీరందరినీ జాలీ హత్య చేసింది. తరువాత.. ఇవన్నీ సహజ మరణాలంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.  సిలీ మృతి చెందిన అనంతరం ఆమె భర్త షాజూను జాలీ రెండో వివాహం చేసుకుంది. ఆ తరువాత టామ్ రాసిన వీలునామా ఆధారంగా తన అత్తమామల ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకుంది.
అయితే టామ్ రెండో కుమారుడు మోజో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబంలో జరిగిన వరుస మరణాల పట్ల కూడా అనుమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జాలీ రెండో వివాహం గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత మొత్తం మిస్టరీ వీడిపోయింది. ఈ హత్యలకు కారణమైన జాలీని.. ఆమెకు సైనైడ్ సరఫరా చేయడంలో సహాయపడిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌కు మించిన ట్విస్టులున్న ఈ ఘోరం ప్రస్తుతం కేరళలో సంచలనం సృష్టిస్తోంది.