24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, ఉత్తరప్రదేశ్‌ల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.