370 రద్దుపై అక్టోబర్‌లో విచారణ

ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనం ఏర్పాటు
కేంద్రం, కశ్మీర్‌ ప్రభుత్వాలకు నోటీసులు
న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని ఢిల్లీలోని సుప్రీంకోర్టు సవిూక్షించనున్నది. రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై అయిదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపట్టనున్నది. కశ్మీర్‌ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారించింది. ప్రతి పౌరుడికి కశ్మీర్‌ వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని సీజేఐ తన వాదనల్లో తెలిపారు. అక్టోబర్‌ మొదటి వారంలో ఆర్టికల్‌ 370 రద్దుపై వాదనలు ఉంటాయన్నారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో ఓ మధ్యవర్తిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. కశ్మీర్‌లో విూడియా ఆంక్షలు, ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత లాంటి అంశాలపై మరో వారం రోజుల్లో సుప్రీం విచారణ చేపట్టనున్నది.  జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం, జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంపై దాఖలైన మొత్తం 14 పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ మొదటివారం నుంచి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్‌ చేయడంతో పాటు జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలంటూ పిటిషర్లు విన్నవించారు. కాగా ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదంటూ కేంద్రం పేర్కొనడంతో సుప్రీం స్పందిస్తూ.. ఏమి చేయాలో మాకు తెలుసు. మేము ఆదేశాలు ఇచ్చాం. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, సోలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ఇంటర్‌లొక్యూటర్‌ను నియమించాలన్న కేంద్రం విజ్ఞప్తిని సైతం సుప్రీం తిరస్కరించింది.