భద్రాచలం మళ్లీ గోదావరి ఉధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం  వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. నీటిమట్టం 53 అడుగుల వరకు పెరగవచ్చని తెలిపారు. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.కాగా, గోదవారి ఉధృతితో దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదావరి నీటిమట్టం 25 అడుగులు దాటింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇండ్లలోకి వరద నీరు చేరింది.